పరమానంద శిష్యుల కథ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం... చదువు కుంటున్నాం.. సినిమాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఇలాంటి పరమానంద శిష్యులనే మించిన నేతలు కోటరీగా ఏర్పడ్డారా ? వాళ్లు పలు కీలక విషయాల్లో జగన్ను గైడ్ చేస్తున్నారా ? లేదా ? చోద్యం చూస్తున్నారా ? అంటే అవును అనే సందేహాలే వస్తున్నాయి. ఓ వైపు జగన్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. చాలా మంది నేతలు ఆయన చుట్టూ చేరి భజన బ్యాచ్గా మారిపోయారే తప్పా ఏ టైంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అనే విషయంలో జగన్కు గైడెన్స్ అయితే ఇవ్వడం లేదని తాజా పరిణామాలతో స్పష్టంగా తెలుస్తోంది.
ఇక కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంతెందుకు చంద్రబాబు టైంలో ప్రతి దానికి పచ్చ రంగు పులుము కుంటూ వచ్చారు. అయితే చంద్రబాబు ఏం చేసినా దొరక్కుండా చేస్తాడు. అయితే ఇప్పుడు జగన్ సీఎం అయిన వెంటనే ప్రతి ఆఫీస్కు మూడు రంగులు పులిమేశారు. దీనిపై విమర్శలు వచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సరే హైకోర్టు దీనిని తప్పుపట్టింది. ఇక నాలుగో రంగు అద్ది ఏదే మేనేజ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మట్టి రంగు వేయాలంటూ ఇచ్చిన జీవో కూడా చెల్లుబాటు కాలేదు.
చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు కోర్టు బోనులో నిలబడి వివరణలు ఇచ్చుకున్నా చివరకు జగన్ మొండి పట్టుదల వీడక ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. అక్కడ కూడా షాకే తగిలింది. హైకోర్టు చెప్పింది కరక్టే... నాలుగు వారాల్లోగా రంగులు మార్చకపోతే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇన్ని పొరపాట్లు జరుగుతున్నా... అనవసరంగా లేనిపోని ఛాన్సులతో విపక్షాలకు అవకాశం ఇస్తున్నా జగన్ చుట్టూ ఉన్న నేతలు పరమానంద శిష్యుల్లా చోద్యం చూస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక జగన్ కూడా ఇలాంటి విషయాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్లానింగ్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.