ఏపీలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన ఇద్దరు నాయకులు ప్రస్తుతం త‌మ హ‌వా న‌డ‌వ‌డం లేద‌న్న ఆందోళ‌న‌తో ఉన్నార‌ట‌. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నా తమ కీలక సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులు ఎవ‌రో కాదు.. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వారి సమస్యలపై పార్టీ లేదా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు బహిరంగంగా త‌మ స‌న్నిహితుల వ‌ద్దే వాపోతున్నార‌ట‌. విష్ణుకుమార్ రాజు వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా చెల్లించలేదని వాపోతున్నారు. ఆయన స్వయంగా అసెంబ్లీలోనే ఈ విషయం ప్రస్తావించారు. అప్పట్లో బిల్లుల విషయంలోనే వైసీపీతో తనకు తీవ్ర విభేదాలు వచ్చాయని కూడా చెప్పారు. కానీ 15 నెలలు గడిచినా ఇప్పటివరకు ఆయనకు పూర్తి బిల్లులు క్లియర్ కాలేదు. ప్రభుత్వం కేవలం కొద్దిపాటి మొత్తాలను మాత్రమే విడుదల చేసిందని, ఇంకా 80 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.


ఈ పరిస్థితి ఆయనను మానసికంగా బాధపెడుతోందట‌. పార్టీ నాయకత్వం కూడా స్పందించకపోవడం తనకు మరింత నిరాశ కలిగిస్తోందని చెబుతున్నారు. కేంద్ర బీజేపీ మంత్రులకు కూడా తన సమస్య వివరించినా, ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఫలితంగా, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా... ప్రభుత్వ అధికారిక ఈవెంట్లకు మాత్రం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మరోవైపు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా తనపై గతంలో వైసీపీ హయాంలో నమోదైన కేసు, ఆ తరువాత జరిగిన విచారణా ప్రక్రియలలో ఎదుర్కొన్న టార్చర్ వంటి పరిణామాలపై ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.


కానీ ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ బీహార్‌లో పనిచేస్తుండగా, అక్కడ న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘురామరాజు పేర్కొన్నారు. రాష్ట్ర పరిధి నుంచి సునీల్‌ను బదిలీ చేయడం పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనా, ఇద్దరు రాజు నాయకులు తమ వ్యక్తిగత సమస్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు అధికార పార్టీకి చెందినవారే అయినా.. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం లేదన్న భావన బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం ఈ ఇద్దరు నాయకుల ఆవేదనపై ఎప్పుడు స్పందిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: