ఆంధ్రప్రదేశ్ గత కొంతకాలంగా ఇసుక సమస్యతో రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో ఎవరు ఇల్లు కట్టుకొలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇసుక కొరత సమస్యతో రాష్ట్రంలో అభివృద్ధి కోసం చేపట్టిన నిర్మాణాల ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రాష్ట్ర అభివృద్ధి కూడా పులిస్టాఫ్ పడిపోయింది. ఇక భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణరంగ కార్మికులు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఉపాధి లేక కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు.
అయితే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యపై ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార వైసీపీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యను తీర్చి నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని నిరసనలు కూడా తెలుపుతుంది. రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ కురవటం వల్ల వరదలు ఎక్కువగా రావటంతో ఇసుక సమస్య ఏర్పడిందని అధికార వైసీపీ నేతల చెబుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక కొరత కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక సమస్య పై అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ గతంలో ఇసుక డిమాండ్ సరాసరి 80 వేల టన్నుల ఉండేదని అయితే వరదల కారణంగా ఈ డిమాండ్ చేరుకోలేకపోయాము అని తెలిపారు. అయితే గత వారం రోజుల నుండి వర్షాలు తగ్గి పరిస్థితి మెరుగు పడిందని తెలిపిన సీఎం జగన్ ...రీచ్ ల సంఖ్య 60 నుండి 90 కిలోమీటర్లు చేరిందని... ఇసుక స్టాక్ పాయింట్ కూడా 137 నుండి 180 పెంచాలని అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ఇసుక రేటును అధికారులు ప్రకటించాలని ఆదేశించారు. రెండు రోజుల్లో ఇసుక రేట్ కార్డు నిర్ణయించాలని అధికారులను ఆదేశించిన జగన్... ఎక్కువ ధరతో ఎక్కువగా ఇసుకను అమ్మే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా సరిహద్దులు అన్ని రూట్లలో చెక్ పోస్ట్ లు పెట్టి... చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.