చైనా సైన్యంలో ఏదో జరుగుతోంది..! మరేదో తెలియని అలజడి మొదలవుతోంది..! మొత్తంగా అంతర్గత పోరుకు తెరలేస్తోంది..! జిన్పింగ్లో కలవరం పుడుతోంది..! ఈ మాటలు కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. నిజంగానే చైనా సైన్యం అదుపుతప్పుతోందా..? శాశ్వత అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా ఒక వర్గం ఏమైనా కుట్రలు చేస్తోందా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇదంతా కూడా జిన్పింగ్ వ్యూహంలో భాగమేనని, సైన్యంలో, ఇతర వర్గాల్లో తనకు శత్రుశేషం లేకుండా చేయడానికి ఆడే నాటకంలో భాగమేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి.. చైనాను మావో.. ఆ తర్వాత.. అన్న కోణంలో చూడాలని అంటుంటారు. ఇప్పుడున్న చైనా.. పేరుకే కమ్యూనిస్టు దేశమని, విధానాలు మాత్రం పెట్టుబడిదారివేనని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. నియంతపాలన కొనసాగుతోందని చెప్పొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి అస్సలు తెలియదు. అంతా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. ప్రభుత్వం చెబితేనే బయటకు వస్తుంది. ఒకవేళ చెప్పాలని చూసినా.. వారి పని అంతేమరి. కరోనా వైరస్ గురించి మొదట చెప్పిన వైద్యుడి పరిస్థితి ఏమైందో ఇటీవలే ప్రపంచం చూసింది. ఇక శాశ్వత అధ్యక్షుడిగా హోదా దక్కించుకునేందుకు జిన్ పింగ్ ఎన్నో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని, వ్యతిరేకులందరినీ జైలు పాలు చేశారని, మరికొందరు కనిపించకుండా పోయారని అంతర్జాతీయంగా టాక్ ఉంది.
తాను శాశ్వత అధ్యక్షుడిగా నిలబడేందుకు తీవ్ర అణచివేతలకు పాల్పడ్డాడని అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే.. చైనా సైన్యంలో ఒక వర్గం జిన్పింగ్కు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అంతర్జాతీయంగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత సరిహద్దు సిక్కింలో చైనా సైనికులు అదుపుతప్పి ప్రవర్తించారని, ఇటీవల రెండు విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయని.. చైనా సైన్యం జిన్పింగ్ కంట్రోల్లో లేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇదంతా కూడా జిన్పింగ్ వ్యూహంలో భాగమేనని, నిత్యం సరిహద్దు దేశాలను టెన్షన్ పెట్టేందుకు చైనా సైన్యం ఇలా ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తుందని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే మరి.