అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్లో కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకు వరకు చేసిన పరీక్షల సంఖ్య 2,38,998కు చేరడమే కాకుండా, ప్రతి పది లక్షల జనాభాకు సగటున 4,476 మందికి పరీక్షలు చేయడం ద్వారా దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రోజుకు సగటుగా పదివేల పరీక్షలకు అటు ఇటుగా చేస్తున్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ఎంత వేగం చేపడితే.. అంతవేగంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా దక్షిణ కొరియా నుంచి ప్రత్యేకంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించారు. అంతేగాకుండా ఏపీలో స్వయంగా కిట్ల తయరీని చేపడుతున్నారు. అయితే... మరి తెలంగాణలో రోజుకు ఎన్నికరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు..? ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారు..? పదిలక్షల జనాభాకు సగటున ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు..? అన్న ప్రశ్నలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. తెలంగాణ ప్రభుత్వం ప్రతీరోజు కరోనా బులెటిన్ విడుదల చేస్తుంది. కానీ.. అందులో మాత్రం సరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు గురించి ప్రస్తావించడం లేదు.
దీంతో అందరిలో గందరగోళం నెలకొంటోంది. అసలు ఇప్పటివరకు ఎంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం వరకు 23,388 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,513 కేసులు నమోదయ్యాయని బులెటిన్లో పేర్కొ న్నారు. ఈ సంఖ్య చూసి అందరూ షాక్ తిన్నారు. తెలంగాణలో ఇంత తక్కువగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 37, రంగారెడ్డి జిల్లాలో రెండు, వలసదారుల ద్వారా మూడు కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,551కి చేరింది. అందులో వలసదారుల సంఖ్య 57గా ఉంది. ఆదివారం 21 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 34 మంది మరణించగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 525 మంది ఉన్నారని ఉన్నారు.