కరోనా వైరస్తో సతమతమవుతున్న భారతీయులకు శుభవార్త.. దేశంలో వైరస్ ముమ్మర దశను దాటిందని, వచ్చేఏడాది ఫిబ్రవరి నాటికి అంతమవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కోవిడ్-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్ అంతమయ్యే సమయానికి ... దేశవ్యాప్తంగా కోటి ఐదు లక్షల మంది వైరస్ బారిన పడతారని కమిటీ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం సుమారు 75 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతానికి కరోనా వైరస్లో ఎలాంటి మ్యుటేషన్ లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇంతవరకూ కరోనా వైరస్ మార్పు జరిగినట్టు ఆనవాళ్లూ లేవన్నారు. సండే సంవాద్ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
భారత్లో ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే ఈ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయన్నారు.చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్... 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. నెలకు దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు.
మొత్తానికి కరోనా వైరస్ దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు గుడ్ న్యూస్ అందింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ వైరస్ అంతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ క్లారిటీ ఇచ్చేసింది. అయితే కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించింది.