ఈసారి ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ పరిస్థితి విభిన్నంగా ఉంది. ఇక్కడి జనాభాలో దాదాపు 27 శాతం ముస్లిములు, మరో 30 శాతం మతువాలు ఉంటారు. గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాలూ చాలావరకు తృణమూల్ కాంగ్రెస్కే అండగా నిలిచాయి. ఫలితంగా ఆ పార్టీకి భారీ ఆధిక్యం దక్కిందని చెప్పొచ్చు. ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపే ఈ రెండు వర్గాలు ఈ సారి ఎటు వైపు మొగ్గుచూపుతాయా అనేది సందిగ్ధం నెలకొంది.
మొన్నటి ఎన్నికల వరకు కూడా బెంగాల్లో ముస్లిములకు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించే పార్టీలేవీ బరిలో లేవు. కానీఈసారి ఎన్నికల్లో ఏఐఎంఐఎం కూడా బరిలో నిలుస్తోంది.
అంతేకాదు బెంగాల్లో చాలా ప్రముఖమైన ఫుర్పురా షరీఫ్కు చెందిన 34 ఏళ్ల మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. మమత పట్ల వ్యతిరేకంగా ఉన్న ఆయన ముందుగా మహాకూటమి వైపు మొగ్గుచూపారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వంపై విముఖత చూపుతూ దానికీ దూరంగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రభావం చూపించే ఈ యువ మత గురువు నిర్వహించే బహిరంగ సభలకూ జనం భారీగానే వస్తున్నారు.
201 ఎన్నికల్లో 38.93 శాతం, 2016లో 44.09 శాతం చొప్పున ఓట్లు సాధించిన మమతకు ముస్లిం ఓట్లు కూడా అండగా నిలిచాయి. ఇప్పుడవి వేర్వేరు పార్టీల మధ్య చీలితే తృణమూల్కు నష్టం తప్పదు.తూర్పు బెంగాల్కు చెందిన మతువాలు–బంగ్లాదేశ్ విభజన తర్వాత పశ్చిమ బెంగాల్కు వలస వచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన వీరు కనీసం ఆరు పార్లమెంటరీ స్థానాల్లో ప్రభావం చూపగలరు. రాష్ట్ర జనాభాలో మూడు కోట్ల మందికి పైగా ఉన్న మతువాల మొగ్గు కూడా కీలకం కానుంది. వారిలో సుమారు రెండు కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. తాము అధికారంలోకి వస్తే మతువాలకు పౌరసత్వం కల్పిస్తామని ఓ వైపు బీజేపీ హామీనిస్తోంది. సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేస్తామని కమలనాథులు అంటున్నారు. మతువా వర్గానికి అండగా ఉన్న బోరో మా, ఆమె మనువడు శంతను ఠాకూర్ బహిరంగంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి, తరువాత వామపక్షాలకు మద్దతుగా ఉన్న ఈ వర్గం ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపింది.