రెండోదశలో కరోనా వీరవిహారం చేస్తోన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్లు పెట్టినా.. కర్ప్యూలు విధించినా కొంతమంది మాత్రం బాధ్యత మరిచి యథేచ్చగా సంచరిస్తున్నారు. కొందరైతే కనీసం మాస్క్లు కూడా ధరించడంలేదు. దీంతో పోలీసులు తమ గస్తీని ముమ్మరం చేయడంతోపాటు ఎక్కడికక్కడ తనిఖీలు విస్త్రతం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం మాస్క్ ధరించడమనేది తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారి నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ వచ్చారు. సామాన్యులా? సెలబ్రెటీలా? అన్న తేడా చూడకుండా నిబంధనలు అతిక్రమించిన వారందరికీ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఇప్పటివరకు వరకు పోలీసులు జరిమానా కింద రూ.31 కోట్లు వసూలు చేశారు.
కరోనా కట్టడిపై కోర్టుకు సమాధానం
రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు లేని వారి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.31 కోట్లు వసూలు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సోమవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా డీజీపీ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లాక్ మార్కెట్లో ఔషధాల అమ్మకాలపై 98 కేసులు, మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసులు నమోదుచేసినట్లు తన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నాలుగు లక్షలకు పైగా కేసుల నమోదు
ఈ నెల ఒకటో తేదీ నుంచి 14 వ తేదీ వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశారు. వీరిలో మాస్క్లు ధరించనివారి నుంచి రూ.31 కోట్లు వసూలు చేశారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారిన పడిన ఉపాధ్యాయులను కరోనా వారియర్లుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో తీసిన వీడియో ఫుటేజ్ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు. ఉదయం 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు గైడ్ లైన్స్ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలకు హైకోర్టు అభినందనలు తెలిపింది.