సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం ఫలిస్తూ ఇవాళ స్థానిక పోరుకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికలు జరగకపోయినా, జెడ్పీ టీసీ,ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం జరిగాయి. స్థానిక అభ్యంతరాలున్న నేపథ్యంలో ఈ సారి కూడా లోకల్ బాడీ లేకుండానే శ్రీకాకుళం నగర కార్పొరేషన్ తన పని తాను చేసుకుపోనుంది. అదేవిధంగా ఆమదాలవలస ము న్సిపాల్టీకీ ఎన్నికలు లేవు. వీటి తీరు ఎలా ఉన్నా జెడ్పీ పీఠంపైనే ఆసక్తి నెలకొని ఉంది. గతంలో జెడ్పీ చైర్మన్ పదవి చేపట్టిన బీసీ మహిళ పెద్దగా రాణించలేదు. చౌదరి ధనలక్ష్మి అనేక వివాదాల నడుమే తన పదవీ కాలాన్ని ముగించేశారు. అలానే ఈ వివాదాలను సరిదిద్దలేక అచ్చెన్న సైతం ఆ రోజు ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక కానీ మరొకటి కానీ ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది.
ఇక కౌంటింగ్ వివరానికి వస్తే...
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. పలు చోట్ల అవంతరాలు సైతం తలెత్తుతున్నాయి. ఎన్నిక లు గడిచి, ఐదు నెలల తరువాత కోర్టు గొడవలు దాటుకుని జరుగుతున్న లెక్కింపు ప్రక్రియ కొన్ని జిల్లాలలో నత్తనడకన నడుస్తోంది. పేరుకే అవి స్ట్రాంగ్ రూమ్ లు కానీ అవి ఏమంత స్ట్రాంగ్ కాదని తేలిపోయింది. గుంటూరు లూథరన్ బీఎడ్ కాలేజీలో ఉంచిన బ్యాలెట్ పేపర్లు తడచిపోయాయి. దీంతో ఇక్కడ కౌంటింగ్ ఆలస్యం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో పది కేంద్రాల్లో, విజయనగరం జిల్లాలో 31 కేంద్రాల్లో లెక్కింపు సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 38 జెడ్పీటీసీ స్థానాలకు గాను 37 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
హిరమండలం ఎన్నిక వాయిదా అయింది. ఇక్కడ 667 ఎంపీటీసీ స్థానాలుండగా, 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 11 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 66 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 31 జెడ్పీటీసీ స్థానాలకు , 487 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు జిల్లాలలో ఓట్ల లెక్కింపును కలెక్టర్లు పర్యవేక్షిస్తు న్నారు.