ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయిస్తామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.  కోడెల మృతి చెందడం చాలా బాధగా ఉందని  కిషన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని హితవు పలికారు. రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. కోడెల  ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తమకు కొన్ని ఫిర్యాదులు అందాయన్న ఆయన తెలిపారు.



పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయనన్నారు. కోడెలతో తనకు వ్యక్తిగత సంబధాలున్నాయని కేంద్ర మంత్రి  గుర్తుచేసుకున్నారు. కోడెల మృతిపై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కోడెల మృతి విచారణ అంశాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని.. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని  కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా కోడెల శివప్రసాద రావు బీజేపీలో చేరాలనుకున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవాలని తనకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోడెల తనను సంప్రదించినట్లు రఘురామ్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.




అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తనను ఏకాకిని చేసిందని కోడెల తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు.కోడెల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆయన జీవించి ఉండి ఉంటే దసరా తరువాత బీజేపీలో చేరి ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఓడిపోయిన వారిని పక్కన పెట్టే సంస్కృతి పార్టీలో పేరుకుపోయిందని, దీనికి తాను కూడా బాదితుడినే అని కోడెల తనకు ఫోన్ ద్వారా వెల్లడించినట్లు రఘురామ్ పేర్కొంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: