శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వరంగల్ జిల్లాకు చుక్కెదురైంది. ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వకపోగా మేడారం, కాళేశ్వరం ప్రాజెక్టుల జాతీయ హోదా విషయం కూడా ప్రస్తావించలేదు. కాజీపేట రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీకి కూడా నిధులు దక్కలేదు. రైల్వే డివిజన్‌ ఏర్పాటు అంశానికైతే అసలు స్థానమే  లభించలేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1,200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు జిల్లాలోని ట్రైబల్‌ యూనివర్సిటీకి మోక్షం లేదు. 

 

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కొన్నేళ్లుగా రాష్రం కేంద్రాన్ని కోరుతోంది. ఎక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందనే ప్రభుత్వం నమ్మకం నీరుగారింది. మరోవైపు దేశంలోనే పేరుపొందిన మేడారం జాతరకు కూడా జాతీయ హోదా కలగానే మిగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. దీనికి ములుగు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతేడు బడ్జెట్‌లో రూ.4కోట్లను మాత్రమే కేటాయించారు. కానీ ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. 

 

బయ్యారం ఉక్కుపరిశ్రమ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆ జిల్లావాసులకు ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఇక్కడ ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఇక గీసుకొండ, సంగెం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఈ పార్క్‌ నిర్మాణం కోసం 2017 అక్టోబర్ 2017లో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణానికి 1200 ఎకరాల భూమిని సేకరించారు. ఇక్కడ అంతర్గత రోడ్ల నిర్మాణం చేస్తుండగా, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.  ఈ పార్కు పూర్తయితే లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశమున్నా కేంద్రం నుంచి స్పందన కనిపించలేదు. 

 

అదే విధంగా హైదారాబాద్‌ - వరంగల్‌ ఇండ్రస్టీయల్‌ కారిడార్‌కు సంబంధించి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. మరోవైపు కాజీపేట రైల్వే డివిజన్, వ్యాగన్‌ షెడ్‌ ఊసే లేదు. కాజీపేటకు మంజూరైన వ్యాగన్‌ పీరియాడిక్ల్‌ ఓవర్‌ హాలింగ్‌(పీఓహెచ్‌) షెడ్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లా వాసులతో పాటు రైల్వే కార్మికులు సైతం నిరాశ చెందారు. బల్లార్షా – విజయవాడకు కాజీపేట మీదుగా వెళ్లే మూడో లైన్‌కు కూడా కేటాయింపు చేయలేదు. ఫిట్‌లైన్‌ ప్రస్తావన, ఎలక్ట్రిక్, డీజిల్‌ లోకోషెడ్ల ఊసు ఎత్తలేదు. కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, రైల్వే కార్మికులు, వారి పిల్లల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన కనిపించలేదు. అయితే, రైల్వే ఉద్యోగులకు ఆదాయపు పన్నును కొద్దిమేర తగ్గించనున్నట్లు చెప్పడం, రైతుల కోసం కిసాన్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించడం కొంత ఆశాజనకంగా కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: