మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారితేనే మనుగడ సాధ్యపడుతుంది. మారకపోతే వెనకబడిపోతాం. అలా మారేవారే నిజమైన విజేతలవుతారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు ఈ ధోరణినే అవలంబిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన బాబు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలకులపై నిప్పులు చెరిగారు. మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరకంగా అందరినీ చెడామడా తిట్టేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చంద్రబాబు మాటతీరు చూసి ఆశ్చర్యపోయారు.
ప్రతి 16 సంవత్సరాలకు ఒక జనరేషన్ మార్పు చోటుచేసుకుంటుంది. అలా మన జీవితకాలంలో ఎన్ని జనరేషన్లు చూడగలిగితే అంత చూస్తాం. దానికి అనుగుణంగానే మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులను ఒంటబట్టించుకుంటే జనరేషన్ గ్యాప్ అనేది లేకుండా అందరితో ముందుకువెళతాం. అదే సూత్రాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. పాతతరం రాజకీయవేత్త అయినప్పటికీ కొత్తతరానికి ఏం కావాలో తెలుసుకొని తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. నేరుగా పదునైన మాటలతో ప్రత్యర్థులను విమర్శించకపోతే ప్రజల్లోకి వెళ్లడం కష్టమని గుర్తించారు. ఇప్పటి తరానికి ఏం కావాలో తెలుసుకొని అందుకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే మాటలైతే తుపాకీ తూటాలా పేలతాయని గుర్తించారు. తన ధోరణి మార్చుకున్నారు. తనను తాను మార్చుకుంటున్నారు. పాత తరానికి, కొత్త తరానికి మధ్య వారధిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.