హుజురాబాద్లో తెరాస నేతలు, కార్యకర్తలను ఈటలవైపుకు వెళ్లకుండా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో తెరాస నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈటల వర్గంగా కొందరు, తెరాస పార్టీ వర్గంగా మరికొందరు నిలుస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కౌశిక్ రెడ్డి సుమారు 61వేల ఓట్లకుపైగా సాధించాడు. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఈటలపై దూకుడుగా వెళ్తున్నారు. విమర్శలతో పాటు అనేక భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఈటలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. దీంతో ఉపఎన్నికలో సత్తాచాటేందుకు కౌశిక్రెడ్డి అన్నిఅస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే కౌశిక్రెడ్డి దూకుడును కాంగ్రెస్లోని కొందరు విమర్శిస్తున్నారు. ఒకపక్క ఈటలకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలుస్తుంటే కౌశిక్ మాత్రం వ్యతిరేఖంగా వెళ్లడం బాగాలేదన్న భావనను కొందరు నేతలు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. కౌశిక్రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో తన పట్టును పెంచుకుంటున్నాడు. ఉపఎన్నిక వచ్చే నాటికి ప్రజల్లోకి మరింత స్పీడ్గా దూసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఉప ఎన్నిక జరిగితే తెరాస శ్రేణులు రెండుగా చీలిపోవడం ద్వారా ఓటింగ్ చీలి అది కాంగ్రెస్కు అనుకూలంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈటల కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఈటల కాంగ్రెస్లో చేరకుంటే, హుజురాబాద్లో ఉపఎన్నిక జరిగితే ఆయనకు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలపడం ద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ నేతలు ఈ అవకాశాన్ని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.