జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. కాగా మొదట ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా పడిపోవటం.. నవంబర్ 9న రిలీజ్ అనుకుంటే.. ఇప్పటివరకూ కనీస స్థాయిలో కూడా బిజినెస్ జరగకపోవడంతో... ఇక లాభం లేదనుకుని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడట. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక ‘దిల్’రాజు, రాజ్ తరుణ్' కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ఇది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి మంచి హిట్ వస్తోందేమో చూడాలి.
కాగా ఈ సినిమాలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి'.. ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాన్నే అందుకుంది. అయితే ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ తో రెచ్చిపోయిన షాలినీ పాండేకు మాత్రం ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ '118'ను మినహాయిస్తే.. అర్జున్ రెడ్డి తరువాత ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమానే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు నిర్మాణంలో షాలినీ పాండేని హీరోయిన్ గా రాజ్ తరుణ్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా షాలినీ పాండేకు కాలం కలిసి వస్తోందేమో చూడాలి. షాలినీ మాత్రం 'ఇద్దరి లోకం'తో తన పరిస్థితి మారుతుందని నమ్ముతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇప్పటికైతే పెద్దగా అంచనాలు కూడా ఏమి లేవు.