'బాహుబలి' తర్వాత చాలా వేగవంతంగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలనుకున్నాడు. అలా తన అభిమానులకి దగ్గరగా ఉండాలి అని ఎన్నో కలలు కన్నాడు. కానీ అనుకున్న విధంగా జరుగడం లేదు. 'సాహో' మూవీ తర్వాత 'రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె' ఇలా వరుస సినిమాలకి సంతకాలు కూడా పెట్టేశాడు. అయితే సినిమాలకు కమిట్ అయినంత సులువుగా వాటిని పూర్తి చేయలేకపోతున్నాడు ప్రభాస్.
'రాధేశ్యామ్' సెట్స్లో ఉండగానే 'సలార్, ఆదిపురుష్' సినిమాలని మొదలు పెట్టాడు ప్రభాస్. విరామం లేకుండా మూడు సినిమాల షూటింగ్స్లోనూ బిజీగా గడిపాడు. అయితే ప్రపంచం మొత్తాన్ని ఇంటికే పరిమితం చేసిన కరోనా పాండమిక్తో ప్రభాస్ సినిమాల షూటింగులకు అడ్డంకులు ఎదురయ్యాయి. అందుకే ఎప్పుడో విడుదల కావాల్సిన 'రాధేశ్యామ్' వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్, దీపిక పదుకొణే లీడ్రోల్స్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ డ్రామా 'ప్రాజెక్ట్ కె'. ఈ మూవీలో బిగ్బి అమితాబ్ బచ్చన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. స్టార్ కాస్టింగ్తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా షూటింగ్కే 12 నుంచి 13 నెలలు పడుతుందని సమాచారం. కాబట్టి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్కి సైన్ చేసినా పూర్తవడానికి మినిమం రెండేళ్లు పడుతోంది. దీంతో ప్రభాస్, అభిమానులను కలిసేందుకు చాలా సమయం పడుతోంది. మరి ఫ్యాన్స్ మాత్రం ఆగలేకపోతున్నారు. దీనికి ప్రభాస్ ఏ విధంగా వాళ్లను సంతృప్తి పరుస్తారో చూడాలి.