అయితే, ఈ పరిణామాల్ని తనకు అనుకూలంగా మల్చుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే.. వ్యవసాయ చట్టాల రద్దుకు చేసిన పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం గులాబీ బాస్కు అనుకూలంగా మారుతుందా..? లేదా కొత్త తలనొప్పులను తీసుకువస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలిసి వస్తే ఏది చేసినా అనుకూలంగా మారుతుంది. అదే మనది కానీ రోజున తాడును చూసి పాము అనుకుని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన వేనుక కేసీఆర్ లక్ష్యం ఏంటనేది అందరికీ తెలిసిందే.. అయితే ఈ నిర్ణయం వరంగా మారే అవకాశాలు ఎన్ని ఉన్నాయో శాపంగా మారేది కూడా అంతే ఉంది. ఎందుకంటే వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడి చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసేందుకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాయం అందలేదన్న విమర్శలు వస్తుంటాయి.. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ తాజా నిర్ణయంతో అలాంటి విమర్శలు వినిపించే వాళ్లకు ఇప్పుడు అవకాశంగా మారిందని తెలుస్తోంది. అదే నిజం అయితే.. దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని చూసిన కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.