సుదీర్ఘ కాలంగా ఉత్కంఠను కొనసాగిన అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఆధారంగా చేసుకుని.. రామమందిర ట్రస్టు అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పూజలు జరిగాయి. ఇటీవలే అక్కడ శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రధాని మోదీ చేతులగా మీదుగా అధికారిక పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ ముహూర్తాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్రస్టు చెప్పింది. చైనాతో లడఖ్ విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. అయోధ్యలో రామాలయ నిర్మాణం పనులను నిలిపివేస్తున్నట్లు రామమందిర ట్రస్టు పేర్కొంది.
గాల్వన్ లోయలో భారత, చైనా బలగాలు హింసాత్మక ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. దేశంలో పరిస్థితులను అంచనా వేసిన తర్వాత.. రామాలయ నిర్మాణ పనుల గురించి కొత్త తేదీని వెల్లడించనున్నట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. గాల్వన్ లోయలో అమరులైన భారత జవాన్లకు ట్రస్టు నివాళి అర్పించింది. చైనాతో సరిహద్దు వద్ద పరిస్థితి భీకరంగా ఉందని, ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవడమే ముఖ్యమని రామమందిర ట్రస్టు పేర్కొంది.
కాగా, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముందు ఇవాళ శివుడికి రుద్రాభిషేకం చేశారు. రామ జన్మభూమి పరిసర ప్రాంతాల్లో ఉన్న కుబేర తిల ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు. మహంతి కమల్ నయన్ దాస్ రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంతి నృత్య గోపాల్ దాస్కు ప్రతినిధిగా కమల్ నయన్ దాస్ పనిచేస్తున్నారు. రామాలయ నిర్మాణం గురించి త్వరలోనే ప్రధాని మోదీని కలవనున్నట్లు నయన్ దాస్ పేర్కొన్నారు. ఆ భేటీకి ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. కోవిడ్19 వల్ల ప్రధాని ఎటువంటి కార్యక్రమాలను హాజరుకావడం లేదన్నారు. వాస్తవానికి కరోనా పరిస్థితి లేకుంటే, ఎప్పుడో రామమందిర నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగేదన్నారు. త్వరలోనే మోదీని కలిసి, ఆయన్ను అయోధ్యకు ఆహ్వానించనున్నట్లు నయన్ దాస్ చెప్పారు. అయితే, తాజాగా ట్రస్ట్ ప్రకటన నేపథ్యంలో ఈ భేటీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.