ఇక అనూహ్యంగా ఇక్కడ బీజేపీ దూసుకువచ్చేసింది. బీజేపీ చేస్తున్న రాజకీయానికి సరైన జవాబు టీయారెస్ ఇస్తోంది. దాంతో అక్కడే రాజకీయ లాభాన్ని కాషాయం పార్టీ పొందుతోంది. తెలంగాణా మొత్తం మీద కాదు, తెలుగు రాష్ట్రాలలోనే దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందా అన్నదంతా సీన్ ఇపుడు క్రియేట్ అయింది. తాజాగా కేటీయార్ మాట్లాడుతూ దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. కచ్చితంగా ఇక్కడి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక హరీష్ రావు అయితే దుబ్బాకలో రాజకీయ లొల్లి చేద్దామని కాంగ్రెస్, బీజేపీ రెండూ చూస్తున్నాయి. కానీ వారికి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారు అంటూ బిగ్ సౌండ్ చేశారు. సరే ఇంతలా ఈ ఇద్దరు టీయారెస్ మేటి నాయకులు చెబుతూంటే నమ్మాల్సిందే కానీ కూల్ గా గెలుచుకోవాల్సిన చోట ఇంత ఆయాసం టీయారెస్ ఎందుకు పడుతుందో అర్ధం కావడం లేదు అంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి గా పోటీలో ఉన్న రఘునందన్ రావు చాలా గట్టి క్యాండిడేట్. దానికి తోడు, బీజేపీ పెద్ద నాయకులు అంతా మోహరించి ఉన్నారు.
మరో వైపు కాంగ్రెస్ తో లోపాయి కారీ ఒప్పందం కనుక బీజేపీ పెట్టుకుంటే మాత్రం ఇక్కడ టీయారెస్ కి కష్టమేనని అంటున్నారు. తెలంగాణాలో కేసీయార్ కి ఒకసారి అయినా పరాభవం చవి చూపిద్దామని కాంగ్రెస్, బీజేపీ రెండూ అనుకుంటున్నాయి. కాబట్టి ఈ రెండూ కూడా చివరి నిముషంలో కూడబలుక్కుంటే మాత్రం టీయారెస్ కి చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు. మరి అది కనుక జరిగితే టీయారెస్ ఫలితం తేడా కొడుతుంది, కానీ కధ అంత దూరం వరకూ వెళ్తుందా అంటే ఏమో ఇది రాజకీయం ఎవరు చెప్పగలరు...