ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాలు వంటి మారుమాల ప్రాంతాల్లో రెండురోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వాలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన సమయంలో ఊళ్లో లేకపోవడం వంటి కారణాలతో ఆ రోజు తీసుకోలేకపోయినవారికి తరువాత నెలలో బకాయితో సహా చెల్లిస్తున్నారు. లబ్ధిదారులెవరూ ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకే డిసెంబర్ నుంచి ప్రతినెలా ఒకటి, రెండు, మూడున మూడు రోజుల పాటూ పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో కూడా తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా 61,69,832 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,510.90 కోట్లను రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో జమచేశారు. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని వారికి నిబంధనల ప్రకారం పింఛను తాత్కాలికంగా నిలిపేసి, మళ్లీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంది. అలాంటి వారికీ ఊరట కలిగిస్తూ.. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని 7,462 మందికి మూడునెలల బకాయిలతో కలిపి ఈనెల డబ్బులను పంపిణీ చేయనున్నారు. మూడు రోజుల పాటూ పింఛన్లు పంపిణీ.. మూడు నెలల బకాయిలు ఇప్పుడు పంపిణీ చేయడంతో రెండు గుడ్న్యూస్లనే చెప్పాలి.