దేశంలో గత సంవత్సరం 2020, మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు గడిచిన గత పది నెలలుగా కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక ఇటీవలే ఈ కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక గతంలో విధించిన అన్ లాక్ మార్గదర్శకాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఆంక్షలను దాదాపు పూర్తిగా సడలించింది.



అలాగే సినీప్రియులకు, పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్ అందించింది. కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. జనవరి 31తో గతంలో విధించిన నిబంధనలకు గడువు ముగుస్తుండటంతో కేంద్ర హోం శాఖ బుధవారం (జనవరి 27) సాయంత్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. సినిమా హాళ్లు, థియేటర్లు అధిక సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు వీటికి 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఉన్న విషయం తెలిసిందే.





ఫిబ్రవరి 1 నుంచి అమలయ్యే కొవిడ్ కొత్త నిబంధనల వివరాలు...



✦ స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు. ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉండగా.. ఫిబ్రవరి 1 నుంచి అందరికీ అనుమతిస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఫిబ్రవరి 1 నుంచి ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. కేవలం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు.


✦ రవాణా సౌకర్యాలపై ఆంక్షలను పూర్తిగా తొలగించారు. అంతర్రాష్ట్ర మరియు రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య ప్రయాణాలకు ఇ-పర్మిట్, స్పెషల్ పర్మిషన్ లాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదని తెలిపారు.


సినిమా హాల్స్, థియేటర్లకు 50 శాతం కంటే అధిక సామర్థ్యానికి అనుమతి ఇచ్చారు. ఈ సడలింపుతో థియేటర్ యజమానులు గరిష్ట సామర్థ్యంతో సినిమా ప్రదర్శనలు కొనసాగించే అవకాశం.


✦ 65 ఏళ్లకు పైబడిన వారు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణిలు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


✦ కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హోం శాఖ స్పష్టం చేసింది.



హోంమంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకొని సమాచార, ప్రసార శాఖ, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి వచ్చే అంశాలపై (సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ తదితరాలు) పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: