హైదరాబాద్ లో బండిని పార్కింగ్ లో పెట్టాలంటే జనాలు భయపడుతున్నారు..వందలకు వందలు వసూల్ చేస్తున్నారు.. మాల్స్, మల్టీప్లెక్సులు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తొలినాళ్లలో అమలైనప్పటికీ.. తర్వాత మళ్లీ పార్కింగ్ ఫీ ను అంతకు మించి వసూల్ చేశారు. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో పెద్దయెత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సిద్ధమైంది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది.


అక్రమంగా ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారంతో ఫొటోను ఆన్‌లైన్‌ ద్వారా ఈవీడీఎంలోని 'సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్‌'కు షేర్‌ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు పెనాల్టీ విధించనుంది. వీటితోపాటు తగిన పార్కింగ్‌ సదుపాయం కల్పించని వాణిజ్యసంస్థల పైనా చర్యలు తీసుకోనుంది. ముందుగా మాల్స్, మల్టీ ప్లెక్సులు, వాణిజ్య సంస్థలకు ఈ విషయం పై ఈరోజు నోటీసులను జారీ చేసింది.


నోటీసులో వివరాలు ఇలా..


పార్కింగ్ కోసం నిర్ణీత రుసుమును విధించాలి..

టిక్కెట్లపై పార్కింగ్‌ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌నెంబర్‌ ఉండాలి.

పార్కింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్‌ టిక్కెట్‌ ఇవ్వాలి.

ఫీజు వసూలు చేస్తే 'పెయిడ్‌' అని, ఉచితమైతే 'ఎగ్జెంపె్టడ్‌' అని స్టాంపు వేయాలి.

పార్కింగ్‌ ఇన్‌చార్జి సంతకంతో కూడిన పార్కింగ్‌ టిక్కెట్లను వాహనాలు నిలిపిన అందరికీ ఇవ్వాలి.

ఈవీడీఎం విభాగం నుంచి నోటీసు అందిన 15రోజుల్లోగా ఈమేరకు ఏర్పాట్లు చేసుకోవాలి.

ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తే 50వేల వరకు జరిమానా విందించనున్నట్లు పేర్కొన్నారు.పార్కింగ్‌ టిక్కెట్‌ వెనుకవైపు 20 మార్చి 2018న ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు ఫీజు ఉచితం, చెల్లింపు ఎలానో ఆ వివరాలు ముద్రించాలి. అవి..


30 నిమిషాల వరకు: ఎలాంటి పార్కింగ్‌ ఫీజు లేదు.
30 నిమిషాల నుంచి గంట వరకు: మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే ఫ్రీ. లేని పక్షంలో అక్కడ వసూలు చేసే నిర్ణీత పార్కింగ్‌ ఫీజు చెల్లించాలి.గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టిక్కెట్‌ను కానీ చూపించాలి. బిల్లు, మూవీ టిక్కెట్‌ ధర పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు..తక్కువ ఉంటే ఫీజును చెల్లించాలి.. వీటన్నిటినీ ప్రజలు గమనించి అయా యాజమాన్యాలకు సహకరించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: