ముఖ్యంగా అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొంటుంటారు. సంపదకు చిహ్నం గా భావించే బంగారం అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే ఏడాది పొడుగునా ఇంట సంపద కొలువు తీరుతుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ రోజున భగవంతుడికి ఏది సమర్పిస్తే అది రెండింతలు అవుతుందని భావిస్తారు. చాలా మంది భక్తులు బంగారం కొని దేవుడికి సమర్పించి తమ ఐశ్వర్యం రెట్టింపు కావాలని కోరుకుంటారు. ఈరోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. నిజానికి అక్షయ తృతీయ నాడు భక్తులు స్వయం పాకం, వస్త్రదానం, ఉదక దానం వంటివి ఎన్నో చేసే వారు కానీ కాలక్రమేణా ఆ ఆచారాలన్నీ కనుమరుగయ్యాయి. ప్రస్తుతం అక్షయ తృతీయ నాడు కేవలం బంగారం కొనుగోలు చేయడమే ముఖ్య ఆచారం అయ్యింది.
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుండగా.. ఈ ఏడాది అక్షయతృతీయ రోజు బంగారం విక్రయాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. లాక్డౌన్, కర్ఫ్యూలు వంటి కఠిన నిబంధనలు అమలు చూస్తున్న నేపథ్యంలో బంగారం సేల్స్ పడిపోయే అవకాశం ఉంది. మళ్లీ వచ్చే అక్షయ తృతీయ పర్వదినం నాటికి భారత దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిద్దాం. ఇకపోతే ఈ రోజున మద్యం తాగకూడదని పండితులు చెబుతుంటారు. అలాగే మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని ఇవి అనారోగ్యానికి కారణం అవుతాయని పండితులు చెబుతుంటారు.