రాష్ట్ర విభజన తర్వాత.. హైదరాబాద్ నుంచి తరలివచ్చి విజయవాడ, గుంటూరులలో అద్దె ప్రాతిపదికన నివాసం ఉంటున్న ఉద్యోగులకు ఈ 30 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. హైదరాబాద్ నుంచి తరలిరాని ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. అలాగే.. నూతనంగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి, డెప్యుటేషన్ పై వచ్చిన వారికీ ఇంటి అద్దె భత్యం ఉత్తర్వులు వర్తించవు.
అంతే కాదు.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర కరవు భత్యాన్ని పెంచుతూ కూడా జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. మూలవేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2019 జనవరి 1 తేదీ నుంచి కరవు భత్యం పెంపుదల ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్ లు, గ్రామ పంచాయితీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికీ డీఏ పెంపుదల వర్తిస్తుంది.
ఇంకా.. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, జ్యూడీషియల్ ఆఫీసర్లకు 148 నుంచి 154 శాతం మేర డీఏను పెంచినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021 జూలై నెల వేతనంతో పెంచిన కరవు భత్యాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. 2019 జనవరి 1 తేదీ నుంచి డీఎ బకాయిలును సమాన వాయిదాల్లో జూలై 2021 జూలై నుంచి చెల్లిస్తారు.