వ్యవస్థలో మార్పులు వస్తాయని, ఆన్లైన్ ద్వారా దాతలు ఎవరైనా దేవాలయాలకు విరాళాలు ఇవ్వొచ్చు అని సూచించారు. ఆన్లైన్ పద్ధతులను, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు పెట్టాలని అధికారులకు ఆదేశించారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలని, పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలి అని అన్నారు. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని అవినీతి లేకుండా ఆలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి అని పేర్కొన్నారు.
దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. దేవాలయాల్లో భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని, ప్రతి దేవాలయంలో ఇచ్చే ప్రసాదాల నాణ్యత మీద దృష్టిపెట్టాలన్న సీఎం.. భక్తులకు గుర్తుండిపోయేలా ప్రసాదాలు ఉండాలన్నారు. తిరుమలలో లడ్డూ తయారీ విధానాలు ఇతర ఆలయాల్లో వచ్చేలా చూడాలని చెప్పారు. దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలని సూచించారు. టీటీడీ నిర్వహణా పద్ధతులపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దేవాలయాల్లో ఆడిటింగ్ కు టీటీడీలో ఉన్న విధానాలను పాటించాలన్నారు సీఎం జగన్.
ఆన్లైన్బుకింగ్, కియోస్క్లు, క్యూఆర్ కోడ్ పేమెంట్స్, ఆన్లైన్ రూం బుకింగ్ సిస్టం మొదలైన డిజిటలైజేషన్ ప్రక్రియకోసం టీటీడీ సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా సర్వేచేసి, వాటిని జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా ప్రతి జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ఒక ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలన్నారు.
రాష్ట్రంలోని సుమారు 18వేల ఆలయాల్లో భధ్రతకోసం సుమారు 47వేలకుపైగా సీసీ కెమెరాలు పెట్టామన్నారు. ఎక్కడ ఆలయాలు ఉన్నా.. వాటి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దేవాదాయ శాఖలో విజిలెన్స్ మరియు సెక్యూరిటీ కోసం ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలన్నారు. వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ తొలగింపును అమలు చేశామన్న అధికారులు మిగిలిన వారికి కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దేవాలయాల్లో పనిచేసే 1305 మంది అర్చకులకు కనీస వేతనం 25 శాతం పెంచుతామని హామీ ఇస్తే, వాస్తవానికి 56శాతం, 100శాతం పెంచామని, దేవాలయాల్లో దూప ధీప నైవేద్యం కార్యక్రమం అమలుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అర్చకులందరికీ ఇళ్లస్థలాల కేటాయింపుపై దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.