సున్నిత ప్రాంతాలైన జూపార్క్, గచ్చిబౌలిలో రాత్రిపూట పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. నిర్దేశిత పరిమితుల కంటే జూపార్క్లో పగలు 8, రాత్రి 19 డెసిబుల్స్ అధికంగా శబ్ద తీవ్రత నమోదు అయింది. గచ్చిబౌలిలో పగటిపూట 9, రాత్రిపూట 15 డెసిబుల్స్ చొప్పున ఎక్కువగా నమోదు అయినట్లు తేలింది. నివాస ప్రాంతాలైన జూబ్లీహిల్స్లో పగలు 3, రాత్రి 12, తార్నాకలో పగలు 6, రాత్రి 13 డెసిబుల్స్ చొప్పున అధికంగా ఉండటం గమనార్హం. వాణిజ్య ప్రాంతాల్లోనూ పగలు 4, రాత్రి 11-15 డెసిబుల్స్ చొప్పున ఎక్కువగా నమోదైంది. పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే నమోదు అవుతోంది. కాకుంటే.. జీడిమెట్లలో పగలు కంటే రాత్రి పూటే అధికంగా శబ్ద తీవ్రత ఉంటోంది.
అయితే వాహన రద్దీ ఎక్కువగా ఉండే పగలు కాకుండా రాత్రి ఎక్కువ శబ్ద తీవ్రత నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి సరకుల్ని మోసుకొచ్చే భారీ వాహనాలు, ట్రావెల్స్ బస్సుల రాకపోకలు రాత్రిపూటే ఎక్కువగా ఉంటాయి. వీటి హారన్ల మోతతోనే శబ్ద కాలుష్యం ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పీసీబీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిర్మాణ పనులు కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే శబ్ద కాలుష్యం చిరాకు, ఆందోళనకు కారణమవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత లోపించి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే రక్తపోటు పెరగడం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.