ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం 'ఆరోగ్యశ్రీ'కి సంబంధించి ప్రజలకు శుభవార్త చెప్పింది. వచ్చే నెల నవంబర్ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. అవసరమనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను కూడా జాబితాలో చేర్చాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు సంబంధించి నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ, పనులపై అధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు. వీటికి దాదాపు రూ.17,300 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. వైద్య కళాశాలల్లో ‘నాడు-నేడు’ పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలపగా.. వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెల్త్‌ క్లినిక్‌లు‌ వచ్చే వరకు ఆరోగ్యశ్రీ రెఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్న 16 వైద్య కళాశాలల్లో కూడా చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలపై కూడా అధికారులతో సీఎం జగన్ చర్చించారు. వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరిలోగా టెండర్ల ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాశాలల నిర్మాణాలకు నవంబర్‌లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు డిసెంబర్‌ నెలలో టెండర్లు పిలవాలన్నారు. విజయనగరం, రాజమహేంద్రవరం, పెనుగొండ, అమలాపురం, ఆదోనిలలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు జనవరిలో టెండర్లకు ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తానికి సీఎం జగన్ చేసిన ఈ ప్రకటనలతో పనులు సత్వరమే మొదలవుతాయని  ప్రజలు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: