గత కొద్దీ కాలంగా తమిళ స్టార్ హీరోలు నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలకావడం.. అవి కొని విడుదల చేసిన నిర్మాతలకు భారీగా నష్టాలే మిగలడం ఇదే రొటీన్ గా జరుగుతుంది. ఇటీవల ఒక్క విజయ్ నటించిన సర్కార్ తప్ప దాదాపు అన్నితమిళ డబ్బింగ్ సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అయినా తెలుగు నిర్మాతలు తమిళ సినిమాలను కొనడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
తాజాగా సూర్య నటించిన బందోబస్త్ థియేట్రికల్ హక్కులను అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న దర్బార్ తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక గతంలో 'కాలా, 2.0' సినిమాలను తెలుగులో విడుదలచేసి నష్టాలను చవిచూశారు ఎన్ వి ప్రసాద్. 2.0 మంచి వసూళ్లనే రాబట్టింది కానీ ఎక్కువ రేటు పెట్టి కొనడం తో బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మరి ఈ సారైనా ఈ నిర్మాతకు ఈ రెండు సినిమాల రూపంలో లాభాలు వస్తాయో చూడాలి.
కేవీ ఆనంద్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న బందోబస్త్ లో సయేశా సైగల్ కథానాయికగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 20న ఈచిత్రం విడుదలకానుంది. ఇక స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న 'దర్బార్'లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ నివేతా థామస్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.