ఇప్పుడు అన్నప్రాసన ఎలా చేయాలో తెలుసుకుందాం.. ఒక మంచి శుభ ముహుర్తాన దంపతులు ఆయురారోగ్యాల కొరకు సంకల్పం చెప్పుకుని గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపించి, శిశువు ,తల్లిదండ్రులు మంత్రపూర్వకంగా కంకణాలు ధరించాలి. శిశువును, ఆ తండ్రి, తన కుడి తొడపై కుర్చో పెట్టుకోవాలి . కొత్త బంగారు లేక వెండి పాత్ర ను, చెంచాను, తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో ఆవు పాలు, నెయ్యి, బెల్లం తో తయారైన పరమాన్నాన్నీ వుంచి, శిశువు మేనమామ మూడు సార్లు శిశువుకు నాకించాలి. మేనమామ లేకపోతే తల్లి తండ్రులే పెట్టవచ్చు.
ఆ తర్వాత బిడ్డ తల్లిదండ్రులు కూడా కొద్దిగా రుచి చూపించాలి. తదుపరి ఆచార్యులు, బంధువులు బిడ్డకు తినిపించి ఆశీర్వచనాలు అందచేయాలి. తర్వాత ఒక చాప కానీ దుప్పటి కానీ వేసి వివిధ రకాలైన వస్తువులు అంటే పుస్తకాలు, ధనం, బంగారం, వెండి, ఇతర పనిముట్లు, ఆహార పదార్థాలు తదితరాలను దేవుడి దగ్గర విడివిడిగా పెట్టి ఆ బిడ్డను వాటి ఎదురుగా వుంచాలి. వాటిలో ఏ వస్తువును ఆ శిశువు పాక్కుంటూ వెళ్లి ముట్టుకుంటాడో, ఆ పనిలో ఆ బిడ్డ నిపుణత సాధిస్తారని అర్థం చేసుకోవాలట. ఇలా మూడు సార్లు ఏ వస్తువులు పట్టుకుంటాడో చూడాలి. మన భారతీయులు బిడ్డకు చేసే మొదటి వేడుక ఇదే.. !!