తెలంగాణలో గత రెండు నెలలుగా రాజకీయాలు అన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు నెలల క్రిందట వరకు సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉండటంతో పాటు క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న ఆయన అనూహ్యంగా తన మంత్రి పదవిని కోల్పోయారు. కేసీఆర్ ఈట‌ల‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి బ‌య‌ట‌కు పంపేశారు. ఈట‌ల టిఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో పాటు తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల ఢిల్లీ వెళ్లి కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక త్వరలోనే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా ఈట‌ల‌ లేదా ఆయన భార్య జమున పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటెల ప్రజలను కలుస్తూ తనకు టిఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని చెపుతున్నారు.

వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు హుజురాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కసి తో ఉన్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అంతా హుజురాబాద్ లో మకాం వేసి అక్కడ ఈట‌ల ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కెసిఆర్ హుజురాబాద్ లో గెలవడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. దీంతో ఇక్కడ మూడుముక్కలాట తప్పేలా లేదు.

హుజూరాబాద్ నియోజకవర్గాన్ని రెండు దశాబ్దాలుగా త‌న కంచుకోట‌గా మార్చుకున్న ఈట‌ల ఉప‌ ఎన్నికల్లో గెలిస్తే ఆయన క్రేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే రాజకీయాలలో ఆయన వెనక పడిపోవడంతో పాటు బిజెపిలో ఒక సాధారణ నేతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈట‌ల గెలిస్తే బీసీ కోటాలో ఆయనకు రాష్ట్ర బిజెపి పగ్గాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ఎంపీగా ఉన్నందున పార్టీ పగ్గాలు ఈట‌ల‌కు ఇస్తే ఆయన టిఆర్ఎస్ లో పలువురు అసంతృప్తులను బిజెపి లోకి తీసుకు వస్తారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈట‌ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ? హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం డిసైడ్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: