దక్షిణాది టాప్ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సినీ వర్గాల్లో జోరుగా చర్చ కూడా జరుగుతోంది.


తమిళ సూపర్ స్టార్ విజయ్ సూచన మేరకు ఆమె రాజకీయాల్లో వస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం కూడా జరుగుతోంది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో త్రిష ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


త్రిష నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇటు కాంగ్రెస్‌ నేతలు సైతం దీనిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఆ పార్టీ నేతల తీరు చూస్తే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. తన అందం, అభినయంతో సినిమాల్లో ఆమె అలరించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల సంఘ సేవ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు.


త్రిషకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కింగ్, బాడీగార్డ్, బంగారం, స్టాలిన్, లయన్ వంటి చిత్రాల్లో నటించారు. 2016లో నాయకి సినిమా తర్వాత తెలుగు సినిమా తెరపై ఆమె కనిపించలేదు. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. వచ్చే నెల 30న త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ వన్‌ సినిమా విడుదల కానుంది. ఈమూవీని మణిరత్నం తెరకెక్కించారు. ధనుష్‌ నటించిన ధర్మయోగి సినిమాలో త్రిష పొలిటికల్ లీడర్‌గా నటించారు.


దక్షిణాదిలో సినీ నటులు..రాజకీయాల్లో కూడా రాణించారు. తెలుగు, తమిళనాట ఇదే రుజువైంది. తమిళనాడులో ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్, కరుణానిధి సీఎం పీఠాన్ని అధిరోహించారు. సాధారణంగా సినీ ప్రస్థానం నుంచి రాజకీయాల్లో అత్యున్నత స్థానాలకు వెళ్లారు. తెలుగు నాట స్వర్గీయ ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు. సినీ నటుడిగా జీవితాన్ని మొదలు పెట్టి..రాజకీయాల్లో విశేషంగా రాణించారు.


తాజాగా త్రిష పేరు తెరపైకి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ ముందుండి నడిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అదే జరిగితే త్రిష రాజకీయాల్లో సక్సెస్ కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్‌కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకానొక దశలో విజయ్‌ రాజకీయాల్లో వస్తారని ప్రచారం జరిగింది. ఆయన తల్లిదండ్రులు విజయ్‌ పేరు ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: