దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందునుంచి అందరూ ఊహించినట్టుగానే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకుపోతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీలో 2013లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎం అయినా కేజ్రీవాల్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అటు కాంగ్రెస్... ఇటు బీజేపీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 67 స్థానాల్లో విజయం సాధించారు.
ఆ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లలో విజయం సాధిస్తే బిజెపి కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఢిల్లీని దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే లేకపోయింది. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఎన్నికలకు ముందు నుంచి దూసుకుపోయారు. ఇక ఇప్పుడు ఫలితాలను చూస్తుంటే కేజ్రీవాల్కు ఢిల్లీలో తిరుగులేదని స్పష్టమైంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్తో కేజ్రీవాల్ను పోల్చి చూడక తప్పని పరిస్థితి. కేసీఆర్ తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో దశాబ్దాలుగా తెలుగు గడ్డపై పాతుకుపోయిన కాంగ్రెస్, టీడీపీ కలిసొచ్చినా చిత్తు చిత్తుగా ఓడించారు. అది పెద్ద రికార్డే. ఇక ఏపీలో నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబునే ఓడించారు. జగన్ సాధించింది అనితర సాధ్యమైన విజయంగానే చెప్పాలి.
ఇక ఇప్పుడు కేజ్రీవాల్ కూడా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీని, మోడీకి కుడిభుజంలా వ్యవహరిస్తోన్న అమిత్ షాను ఢీ కొట్టి.. వారి వ్యూహాలు చిత్తు చేసి మరీ విజయం సాధించారు. భారత దేశ రాజధాని.. పైగా ప్రధానమంత్రి ఉండే ఢిల్లీని వరుసగా మూడు సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఏదేమైనా కేజ్రీవాల్, జగన్, కేసీఆర్ అందరూ అక్కడ బలంగా పాతుకుపోయిన కుంభస్థలాలను కొట్టడం విశేషం.