కొత్తగా ఏ పని లేదా కార్యక్రమం ప్రారంభించినా తొలుతగా ఆ విఘ్నేశ్వరునికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది మన శాస్త్రాలు చెబుతున్న ప్రతిష్టాత్మక విషయం. ఆయనను ధ్యానం చేయకుండా..ఏ దేవుడిని కొలిచినా ఫలితం శూన్యం అని చెబుతుంటారు. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందితే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ పని సక్రమంగా విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతారు. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు 'ఋగ్వేదం' చెబుతోంది. గజ ముఖ గణపతి అన్ని దోషాలను తొలగించి.. మనం చేపట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతం అయ్యేలా ఆశీర్వదిస్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయి.
అలా అని వినాయకుడికి పూజ చేయకుండా పని మొదలు పెడితే ఖచ్చితంగా ఆటంకాలెదురవుతాయి అని చెప్పలేము కానీ.... అయితే ఏ పనైనా మొదలు పెట్టేముందు ఆ వినాయకుని ధ్యానించడం లేదా పూజించడం ఎంతో మంచిది. తద్వారా ఆ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుంది అన్నది మన నమ్మకం. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వినాయక చవితికి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వీధి వీధి కి విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు జరుపుతుంటారు.