మోడీ ప్రధాని అయ్యి ఏకంగా ఏడేళ్లు దాటిపోతోంది. కానీ.. ఇంకా నల్లధనం అంశం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అంతే కాదు.. అసలు ఈ స్విస్ బ్యాంకుల్లో నల్లధనం లెక్కలు లేవని నిస్సిగ్గుగా పార్లమెంటుకు చెప్పేసింది. తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా మరోసారి బ్లాక్ మనీ అంశం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ ఒకాయన.. గత పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం జమ అయ్యిందని ప్రశ్నించాడు. వివరాలు చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగారు. విదేశాల నుంచి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.
ఈ ప్రశ్నలకు కేంద్రం దిమ్మతిరిగే జవాబు చెప్పింది.. అదేంటో తెలుసా.. అసలు గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్మనీకి సంబంధించి అధికారికంగా అంచనాలేమీ లేవట. దీనికి సంబంధించి లెక్కలు లేవట. పదేళ్ల నుంచి లేవంటే.. పదేళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి మోడీ పగ్గాలు చేపట్టాక ఏం చేసినట్టు.. ఏడేళ్ల నుంచి కనీసం లెక్కలు కూడా తెప్పించకుండా ఏంచేస్తున్నట్టు.. ఏడేళ్ల నుంచి నల్లధనంపై ఏమీ చేయని మోడీ సర్కారు ఇక ముందైనా ఏమైనా చేస్తుందా..?
ఈ ప్రశ్నలకు కేంద్రం చెప్పిన జవాబు దారుణంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా దేశాల కలసి పని చేస్తున్నామని రొటీన్ సమాధానం చెప్పారు. మరి ఎన్నాళ్లు పని చేస్తారో.. ఎప్పటికి నల్లధనం వెనక్కి తెస్తారో..ఆ రాముడికే తెలియాలి.