కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో చాలా మంది తమ వాహనాలతో రోడ్లపైకి వచ్చి పోలీసులకు బుక్ అయ్యారు.. తమ వాహనాలను పోలీసులకు స్వాధీనం చేసి ఉత్త చేతులతో ఊపుకుంటు వెళ్ళారు.. ఇక ఇంటికెళ్లినాక తల్లిదండ్రులు పెట్టే చివాట్లకు కొందరైతే పోయిన వాహనాలను ఎలా తెచ్చుకోవాలిరా దేవుడా అని ఆలోచిస్తుంటే, మరికొందరు దార్లు వెతుకుతున్నారు.. ఈ లాక్డౌన్ ఉల్లంఘించిన చాలా మంది వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఎక్కడపడితే అక్కడ పెట్టారన్న విషయం తెలిసిందే.. అసలే మన నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో వాహనాలు పార్కింగ్ చేసే సౌలభ్యం చాలా తక్కువ..
ఇక ఎట్టకేలకు లాక్డౌన్ ముగించే సమయం దగ్గర పడుతుండటంతో ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాలకు మోక్షం లభించనుందని తెలిసింది.. ఇందుకు గాను వాహనదారులు తమ వాహనాలను తీసుకెళ్లడానికి చేయవలసిన పని ఏంటంటే పేటీఎం, ఫోన్ పే, మీ సేవ ద్వారా రూ.500 జరిమానా చెల్లించి తమ తమ వాహనాలను తీసుకెళ్లండని పోలీసులు చెబుతున్నారు.. ఇకపోతే ఇప్పటి వరకు ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు సీజ్ చేసిన వాహనాలను మాత్రం కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీ నుంచి వైన్ షాపులతో పాటు, నిర్మాణ, కిరాణా తదితర వ్యాపారాలకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కూడా సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ కరోనా సమయంలో దాదాపుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేశారట. ఇందులో సివిల్ పోలీసులు లక్షకు పైగా, ట్రాఫిక్ పోలీసులు మరో 50వేల వరకు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటున్నారు. ఇక వాహన దారులకు పోలీసుల తాజా నిర్ణయంతో భారీ ఊరట లభించింది.. మరెందుకు ఆలస్యం ఆ పనిలో ఉండండి..