ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆయన మంత్రివర్గ సహచరులు తమ ముద్రను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్దికాలం క్రితం ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. అమరావతిలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు బయల్దేరారు. హైవేపై కాన్వాయ్ వెళుతుండగా.. దారి మధ్యలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని గమనించి తన వాహనం ఇచ్చి పంపిన సంగతి గుర్తుండే ఉటుంది. తాజాగా మరోమారు అదే చర్యతో వార్తల్లో నిలిచారు.
మరో మంత్రి పేర్ని నాని తాజాగా అదే రీతిలో ప్రత్యేకత చాటుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రోడ్డుపైకి దిగి ట్రాఫిక్ను దగ్గరుండి క్లియర్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మంత్రి వెళ్తున్న సమయంలో రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటుండటంతో వాహనాలను దగ్గరుండి క్లియర్ చేశారు. కాగా, దీనికంటే ముందు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్ని నాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మంత్రి అనే దర్పానికి దూరంగా ఉండే పేర్ని నాని తీరు తాజా ఘనతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదిలాఉండగా పేర్ని నాని నిరాండంబర తత్వం అనేక సందర్భాల్లో వార్తల్లోకి ఎక్కింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, అందరితో కలిసి భోజనం చేయడం వంటి చర్యలతో పేర్ని నాని తన ప్రత్యేకతను, సింప్లిసిటీని చాటుకున్నారు. తాజాగా రోడ్డుపైకి దిగి ట్రాఫిక్ను దగ్గరుండి క్లియర్ చేయగా అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. కేబినెట్ మంత్రి అనే హోదాను సైతం పక్కనపెట్టి సైతం సామాన్యుల కోసం నాని ట్రాఫిక్ క్లియర్ చేశారని అంటూ సోష్ మీడియాలో ఆయన గురించి ప్రచారం హోరెత్తుతోంది.