కరోనా దెబ్బకు అన్ని రంగాలూ అతలాకుతలం అవుతున్నాయి. రాబడి లేకపోవడంతో వ్యయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటున్నాయి. వివిధ కంపెనీల్లో వేతనాల కోత, ఉద్యోగుల తొలగింపు వంటి ఉదంతాలనేకం ఇప్పటికే చూశాం.
తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా పొదుపుబాట పట్టింది. ప్రధానంగా రక్షణ శాఖ బడ్జెట్పై కన్నేసింది. దేశ రక్షణ శాఖ వార్షిక బడ్జెట్ దాదాపు రూ.1.86 లక్షల కోట్లు. ఇందులో 20 శాతం కోత విధిస్తే సుమారు రూ.40 వేల కోట్లు ఆదా అవుతుంది. కరోనా కాలంలో రక్షణ వ్యయాన్ని తగ్గించడమే మేలనీ, ఆయుధాల కొనుగోలును వాయిదా వేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రక్షణ శాఖ వ్యయాన్ని 15 నుంచి 20 శాతం తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే రక్షణ శాఖ సిబ్బంది వేతనాల్లో కోత ఉండదు. రక్షణ శాఖ పింఛన్లు, మాజీ సైనిక సిబ్బంది ఆరోగ్య పథకాలలోనూ ఎలాంటి కోతలు ఉండవు. రక్షణ కోసం అధిక మొత్తం ఖర్చు చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.