తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అందులోనూ హైదరాబాద్లో వైరస్ వ్యాప్తి అంతుచిక్కడం లేదు. భాగ్యనగరం కరోనా మహమ్మారికి హాట్స్పాట్గా మారుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం నమోదు అయిన 79 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనికే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మరో 51 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 37 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉండడం గమనార్హం. మిగిలిన 14 కేసులు వలస కూలీలవి. కరోనాతో మంగళవారం ఇద్దరు చనిపోయారు. వీరిలో హైదరాబాద్ మూసాబౌలికి చెందిన 61 ఏళ్ల వ్యక్తి, జియాగూడకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 70 కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు అధికారులు. ఈ ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ కేసుల సంఖ్య 1,326కి చేరుకుంది. వలస కూలీల్లో 12 మంది యాదాద్రి జిల్లాకు చెందినవారుండగా, మరో ఇద్దరు జగిత్యాల జిల్లాకు చెందినవారున్నారు. మంగళవారం 21 మంది కోలుకున్నారని, దీంతో ఇప్పటివరకు మొత్తం 822 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 472 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం డిశ్చార్జి అయినవారిలో హైదరాబాద్కు చెందినవారు 13 మంది ఉండగా.. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు చెందినవారు ముగ్గురు చొప్పున.. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 32కి చేరుకుంది.