దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు పోరాడుతున్నారు. ఇదే సమయంలో విశాఖలో భయంకరమైన అనర్థం జరిగింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడి చుట్టుపక్కల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. మనుషులులే కాదు పశుపక్షాదులు విల విలలాడిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. ప్రమాదం జరిగి నెల రోజులు అవుతున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి వెళ్లిన వారు కూడా వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా మరో బాధితుడు కూడా మరణించాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ ఘటనతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఎల్జీ పాలిమర్స్ విషాద ఘటన బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉంది. వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని కేజీహెచ్లో చికిత్స అందించారు.
ఆ తర్వాత అతన్ని ఇంటికి పంపించారు. అయితే రెండు రోజుల క్రితం మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వరుస ఘటనలు గ్యాస్ లీకేజీ బాధితులను వణికిస్తోంది. కాగా మే 7న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తిరిగి పనులు మొదలుపెట్టింది. అప్పుడే గ్యాస్ లీకేజీ కావడంతో జనం శ్వాసతీసుకోవడంతో ఇబ్బంది పడ్డారు.