సంక్షేమం అనేది బ్రహ్మ పదార్థం లాంటిదనే చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.2 కే కిలో బియ్యం పేరుతో పథకం తీసుకురావడం అప్పట్లో సంచలనం. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సీఎం ఒక్క రూపాయికే కిలో బియ్యం పథకం ఇచ్చారు. అయితే పథకాలు ఒక సారి ప్రజల వరకు వెళితే వాటిని తీసేయ్యలేరు. చంద్రబాబు రెండు రూపాయల బియ్యం పథకం తీసేసినా మళ్లీ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టారు.


కానీ వాటిని ఎవరూ ఇప్పటి వరకు తీసేసే సాహసం కూడా చేయలేరు. ఎందుకంటే వాటిని తీస్తే వారు అధికారంలో నుంచి  దిగిపోతారు.  అంతలా ప్రజల్లోకి ఆ పథకాలు చొచ్చుకెళ్లిపోయాయి. వాటికి అదనపు హంగులు కల్పించి ఇవ్వాలి తప్ప తీసేయలేరు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. దీనికి రాహుల్ గాంధీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కర్ణాటకలో రూ. 2 వేలు ప్రతి మహిళకు నెలకు ఒక్కసారి ఇస్తామని ప్రకటించారు.  


200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, రూ. 3000 వేల రూపాయల నిరుద్యోగ భృతి డిగ్రీ పూర్తయిన ప్రతి విద్యార్థికి మూడేళ్ల పాటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ నిచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడికి వెళ్లిన కాంగ్రెస్ ఇస్తున్న హామీలు చర్చనీయాంశం అవుతున్నాయి. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అంటే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.


ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే పథకంలా కనిపిస్తోంది. రాబోయే ఆంధ్ర, తెలంగాణ ఎన్నికల్లో సైతం నాయకులు పోటీ పడి మరీ పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉచిత పథకాల వల్ల ఇప్పటికే సోమరులు అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. మరిన్ని ఉచితాలు ఎవరికి మంచి చేస్తాయో.. ఎవరిని గద్దె దించుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: