గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పడరాని పాట్లు పడుతున్న విషయం తెలిసిందే..‌‌. ఇక ఈ మహమ్మారి నిర్మూలనకు సంబంధించిన వ్యాక్సిన్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‌ వ్యాక్సిన్ విషయంలో వేగం ఎంత ప్రధానమో భద్రత కూడా అంతే ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దుష్ప్రభావాలు వస్తాయని తెలిపారు. అందుకే శాస్త్రీయంగా అన్ని కోణాల్లో పరీక్షించిన తర్వాతే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌‌ను అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. కరోనా వైరస్ కట్టడి గురించి చర్చించారు. వ్యాక్సినేషన్‌ భవిష్యత్తు కార్యాచరణపై అభిప్రాయాలు తీసుకున్నారు.



దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. దేశంలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. భారత వ్యాక్సిన్ తయారీ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే.. ప్రతి ఒక్కరికీ అందేలా ఏర్పాట్లు చేస్తామని మోదీ తెలిపారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత వ్యాక్సిన్‌ ప్రాధాన్యాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. టీకా పంపిణీకి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్‌ స్టోరేజ్‌లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అయితే.. వ్యాక్సిన్‌ ధరలు, డోసుల లాంటి ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ‘అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కరోనా రికవరీ రేటు పెరిగింది. మరణాలు తగ్గాయి. తక్కువ మరణాల రేటులో ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. కరోనా మహమ్మారితో పోరులో ఎలాంటి నిబద్ధతతో పనిచేశామో, వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలోనూ అంతే నిబద్ధతగా ఉంటాం’ అని మోదీ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: