
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ మారబోతున్నాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పుష్ప మూవీతోనే అతడు మొదటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుండగా, మొదటి భాగాన్ని ఈ సంవత్సరమే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పుష్ప- ది రైజ్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన, విలన్గా మళయాళ స్టార్ ఫహాద్ ఫాసిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఇదే క్రిస్మస్ రోజున అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా కూడా ఇండియా అంతటా విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే పి.కే, దంగల్ సినిమాలతో ఎన్నో రికార్డులు నెలకొల్పిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో బాహుబలి రికార్డులను కూడా తిరగ రాస్తాడని, అంతే కాకుండా వరుస అపజయాలతో ఢీలా పడిపోయిన హిందీ పరిశ్రమను ఈ సినిమాతో కొత్త ఉత్తేజం నింపుతాడని అందరూ భావిస్తున్నారు. ఒకే రోజున రెండు పాన్ ఇండియా సినిమాలు బహుళ భాషల్లో విడుదల కానుండటంతో ప్రేక్షకులకు మంచి కిక్ లభిస్తుందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య లాల్ సింగ్ చద్ధా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి, దీనిని తప్పకుండా తెలుగులో కూడ విడుదల చేస్తారనడంలో సందేహం లేదు. అయితే పుష్ప సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఇటీవలే అల్లు అర్జున్ తెలపడంతో, త్వరలో బన్నీ కూడా ప్రభాస్ లాగా పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు సినీ క్రిటిక్స్ తెలిపారు.