సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి ఆర్టీసి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 700 బస్సు సర్వీసులు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గత రెండేళ్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా 2200 బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసి ఈ దఫా కేవలం 1500 బస్సుల్ని మాత్రమే నడుపుతామని ప్రకటించింది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గించేశారు. ఇప్పుడు పండగకి కూడా బస్సులను పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకరకంగా ప్రయాణికులకు ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.

కరోనా కారణం అని చెబుతున్నా, ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి సర్వీసులను నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు అధికారులు. ఈమేరకు అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండక్కి ఎన్ని సర్వీసులు నడపాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక బస్సులపై ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోబోతున్నారు. అత్యధిక సర్వీసులు హైదరాబాద్‌కు తిప్పేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ఈ జిల్లాలకు వెళ్లేందుకు ప్రతి ఏటా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయగోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్సులు అధిక సంఖ్యలో నడపబోతున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు నడపుతామంటున్నారు అధికారులు.

హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ లో రద్దీ తగ్గించేందుకు, బస్సుల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌లో బస్సుల పార్కింగ్ కోసం ఏపీఎస్ ఆర్టీసీకి స్థలం ఉంది. దీంతో అక్కడ ఇబ్బంది లేదని అంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, పండుగ స్పెషల్‌ బస్సులన్నీ ఎంజీబీఎస్ బయట ఉన్న సిటీ బస్ టెర్మినల్ నుంచి బయలుదేరతాయని చెప్పారు. గతేడాది పండక్కి ఆర్టీసీ రూ.67 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టింది. ప్రయాణికులపై భారం మోపకుండా 40శాతం రాయితీతో ప్రత్యేక సర్వీసుల్ని నడిపింది. ఈ దఫా బస్సుల సంఖ్య తగ్గించడంతో ఆదాయం తగ్గడంతోపాటు.. ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: