ఇటీవలే ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలోనూ అలాగే ఉద్దండులైన సీనియర్ నాయకులను ఎదుర్కొనటంలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ యువ కెరటం తేజస్వీ యాదవ్ చూపిన తెగువ మరియు పోరాటం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు తెరతీసిన సంగతి అందరికీ తెలిసిందే... ఈ ఒక్క అసెంబ్లీ ఎన్నికలతో ఒక్కసారిగా యావత్తు దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు లాలూ ముద్దుల తనయుడు తేజస్వీ యాదవ్. ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్ వంటి కాకలు తీరిన నేతలను ఢీకొట్టి ఎన్‌డీఏ కూటమికి తేజస్వీ చెమటలు పట్టించారు. అయితే త్రుటిలో విజయం చేజారినా, ఆయన పోరాటానికి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా.. తేజస్వీ యాదవ్ భవిష్యత్తులో దేశ ప్రధాని అవుతారని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక స్వామీజీ జోస్యం చెప్పారు.
 
 
 కొత్త ఏడాది సందర్భంగా పట్నాలో లాలూ ఇంటికి పలువురు ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో స్వామి శ్రద్ధానంద్ మహారాజ్ కూడా వచ్చారు. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ భవిష్యత్‌లో భారత ప్రధానమంత్రి కానున్నారని భవిష్యవాణి చెప్పారు. లాలూ ఇంటికి తరచూ వచ్చే శ్రద్దానంద మహరాజ్ భవిష్యవాణి చెబుతారు.. కాశీలో ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లోని భఖ్తియాపూర్‌లో కూడా ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. రబ్రీదేవి ఇంటికి వచ్చిన బాబా ప్రసాదంతో పాటు భగవద్గీతను ఆమెకు బహుకరించారు. ఆ ప్రసాదాన్ని రబ్రీ.. రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త లాలూకు కూడా పంపించారు. రబ్రీని కలసిన శ్రద్ధానంద మహరాజ్.. మీ కుమారుడు తేజస్వీ యాదవ్ ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తేజస్వికి ప్రస్తుతం కొన్ని ఆటంకాలున్నాయని, అవి త్వరలోనే తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. లాలూ కుమారులు దేశానికి నేతృత్వం వహిస్తారని వివరించారు. కొంతకాలం కిందట అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారని తమ గురువు చెప్పారని, అది నిజమయ్యిందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: