వచ్చే నెల నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు అమరావతి రైతు మహా పాదయాత్ర కొనసాగనుంది. నేలపాడులోని హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు నిర్వహించే రైతు మహా పాదయాత్రలో వందలాది మంది రైతులు పాల్గొంటారని అమరావతి జేఏసీ చెబుతోంది. ప్రతిరోజూ 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. హైవేలు, పట్టణాల మీదుగా కాకుండా పల్లెల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. అమరావతి ప్రాధాన్యతను, అవసరాన్ని.. గ్రామాల్లో రైతులు వివరించనున్నారు. మూడు రాజధానుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకు ప్లాన్ చేశారు. డిసెంబర్ 17వ తేదీన తిరుపతి చేరుకొని అమరావతికి అనుకూలంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అమరావతికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు, మేధావులు, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించనున్నారు.
అమరావతి రైతు మహాపాదయాత్రకు సన్నాహకంగా ఈ నెల 17వ తేదీ నుంచి గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే వెంకటపాలెంలో చైతన్య యాత్రలను రైతులు ప్రారంభించారు. మందడం గ్రామంలో చైతన్య యాత్రను నిర్వహించారు. రాజధాని ప్రాంతం నుంచి వందలాది మంది రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమం మరికొన్ని రోజుల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో.. ఉద్యమానికి ఊపునిచ్చేలా చేపట్టిన "అమరావతి రైతు మహా పాదయాత్ర" ఎలా సాగుతుందో చూడాలి.