కరోనా వైరస్ లేదా కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్తో 10 వేల మంది ప్రజలు మృతి చెందారు. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అమెరికా, యూరప్ దేశాలు కోవిడ్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, కాదని బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. యూరప్ దేశాలు లాక్ డైన్ ప్రకటించాయి. మరోవైపు భారత్లోనూ కరోనా ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేవలం నిన్న ఒక్క రోజే 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇక భారత్ లో ఇప్పటివరకు వైరస్ సోకి నలుగురు మరణించిన విషయం తెలిసిందే. కరోనా బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. వైరస్ కట్టడికి పలు సూచనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతలతో ఈ వైరస్ కట్టడవుతుందనుకోలేమని, అలర్ట్గా ఉండాల్సిందేని ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. మరియు అన్ని ప్రధాన నగరాలు ముంబై, పుణె లాంటి చోట్ల మార్చి 31 వరకు కార్యాలయాలు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక కరోనా దెబ్బ మనుషులపైనే కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ఇక జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ మెట్రోరైలు సర్వీసులను మూసివేయాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేర ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మెట్రో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 22వతేదీన జైపూర్ నగరంలో మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు జైపూర్ మెట్రోరైల్ కార్పొరేషన్ వెల్లడించింది.