ప్రకృతి మనిషికి గుణపాఠం చెప్పాలని చూస్తుంది. కానీ మేధావిగా మారిన మనిషి ఇదంతా పట్టించుకోవడం లేదు.. తన ఆలోచనలు అనే విషపు బీజాలను అభివృద్ది పేరిట నాటుతూ ప్రపంచ నాశనానికి మూలం అవుతున్నాడు.. అనాది నుండి మనిషి అహంతో విర్రవీగుతుంటే ఏదో ఒక విపత్తు వినాశనం కలిగిస్తుంది.. కొంత కాలం బాధపడి మళ్లీ అదే దారిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.. ఇకపోతే లోకాన్ని ఇప్పుడు కరోనా అనే మాయదారి రోగం పట్టిపీడిస్తుంది.. ఈ కరోనా కాటుకు ప్రజలందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతుంటే.. ఇది చాలదన్నట్లుగా విశాఖాలో జరిన ప్రమాదం మానవుల నిర్లక్ష్యానికి నిలుటద్దంలా నిలిచింది..
ఇక ఇప్పటికైనా మేలుకుంటున్నార అంటే అదీలేదు.. ఎందుకంటే విశాఖ నగరంలో నివాసాల మధ్య పరిశ్రమలు ఉండడమే ఆ ప్రమాదానికి కారణం. అలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరంలోనూ పోంచి ఉంది. ఇకపోతే ప్రమాదకర పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలుగా గుర్తించి.. రెడ్ కేటగిరీలో ఉన్న వాటిని ఔటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలన్న ప్రతిపాదన గత దశాబ్దకాలంగా ఉన్న నేపధ్యంలో ప్రభుత్వాలు మారుతున్నా ప్రమాదకర పరిశ్రమలు మాత్రం నగరం మధ్యలో నుంచి తరలిపోవడం లేదు. ఇక ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో పలు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇందులో జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, నాచారం, మల్లాపూర్ వంటి ప్రాంతాల్లో రసాయన, ఫార్మా, బల్క్ డ్రగ్ వంటి కంపెనీలు ఉన్నాయి. అయితే ఆయా పరిశ్రమలన్నీ లాక్డౌన్ కారణంగా మూతపడ్డాయి. వీటిలో ప్రమాదకర రసాయన పరిశ్రమలూ ఉన్నాయి..
ఇకపోతే ఈ లాక్డౌన్ నేపధ్యంలో వాటిని మూసివేసినప్పటికి క్రమం తప్పకుండా వాటికి నిర్వహణ ఉండాలి. అయితే ఇన్ని రోజులపాటు మూసి ఉంచిన పరిశ్రమల్లో సరైన పద్ధతుల్లో నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారా అన్నది ఇప్పుడు సందేహాన్ని కలిగిస్తుంది.. ఒకవేళ లాక్డౌన్ ముగిసిన నేపధ్యంలో వాటిని తెరిచే క్రమంలో విశాఖలో జరిగినట్లుగా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు.. కాబట్టి ఇప్పుడు ఇలాంటి విషయంలో కూడా ఫ్యాక్టరీ యజమాన్యాలతో పాటుగా, అధికారులు కూడా తగినన్ని జాగ్రత్తలు చేపట్టకుంటే మహానగరం మరో విశాఖగా మారే పరిస్దితులు తలెత్తవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి..