కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ కోసం ఒక కులం అర్హతను నిర్ణయించడానికి, 2021 జనగణనలో ఇతర వెనుకబడిన తరగతులు, దళితుల సామాజిక, విద్య, ఆర్ధిక స్థితిగతులను లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ పిల్‌‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై కేంద్రం స్పందనను కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ రామసుబ్రమణియంల త్రిసభ్య ధర్మాసనం కేంద్ర హోం శాఖకు నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యా సంస్థల్లో మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేసినప్పటి నుంచి ఓబీసీ గొడుగు కిందకు వచ్చే వెనుకబడిన కులాల సంఖ్యను లెక్కించడంలేదని పిటిషనర్ టింకు సైనీ తరఫున న్యాయవాది సోనియా సైనీ ధర్మససానికి తెలియజేశారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రవేశాలకు కోటాను పొడిగించడం.. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి ఎటువంటి సమాచారం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలను విన్న ధర్మాసనం.. కేంద్ర హోం శాఖతోపాటు రిజిస్ట్రార్ జనరల్ అండ్ జనగణన కమిషనర్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌లకు నోటీసులు జారీచేసి, స్పందన తెలియజేయాలని కోరింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఓబీసీల సామాజిక, ఆర్థిక స్థితిని లెక్కించడం చాలా అవసరమని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల ద్వారా సంబంధిత డేటాను సేకరించి వారి సంఖ్య, వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి ఉత్తమైన మార్గమని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: