అయితే వర్షాలు పడి భారీ వరదలు వచ్చినప్పుడు పూర్తిగా ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలో కి వెళ్ళి పోతూ ఉంటుంది. కనీసం భక్తుల రాకపోకలకు కూడా అనుమతి ఉండదు. ఆలయంలో గర్భగుడి లో ఉన్న దుర్గ మాత పాదాల చెంతకు వరదనీరు కూడా వచ్చి చేరుతూ ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికి కూడా ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల నుంచి ఆలయంలోకి రాకపోకలు నిలిపివేశారు ఆలయ అధికారులు.
అయితే ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలో నుండి క్రమక్రమంగా బయటపడుతుంది. అయితే ఏడుపాయల్లో మంజీరా నది వరద ఉధృతికి జలదిగ్బంధంలో కి వెళ్లి పోయిన వనదుర్గ ఆలయానికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మంజీరా నది మరింత ఉధృతంగా ప్రవహించడంతో ఆలయంలోని పలు పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఐదు రోజుల నుంచి జలదిగ్బంధంలోనే ఉన్న ఆలయ మండపం పరిసరప్రాంతాలు దుర్గంధంతో నిండిపోయాయి. ఇక మండపం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఇక గర్భగుడి ద్వారం దగ్గర భారీగా చెత్త వచ్చి చేరింది. అంతే కాకుండా ప్రత్యేక దర్శనానికి వెళ్లే క్యూలైన్లు కూడా ధ్వంసం అయ్యాయి.