మొదట పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే అధికారులకు పోలింగ్ స్లిప్తో పాటు ఎన్నికల సంఘం సూచించిన 21 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. అప్పుడే ఓటు వేయడానికి అనుమతి ఇస్తారు. ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లి పోలింగ్ స్లిప్ చూపిస్తే.. ఆ క్రమసంఖ్య/ పేరు జాబితాలో ఉందా? లేదా? అనేది చూసి అక్కడ ఉండే వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు వినబడేలా గట్టిగా చదువుతారు. వారు ఓకే చెప్పిన తర్వాత.. పక్కన ఉండే పోలింగ్ సిబ్బంది ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా మార్క్ వేస్తారు.
ఆ తర్వాత అక్కడ ఉండే మరో అధికారి ఓటరు సంతకం తీసుకొని బ్యాలెట్ పత్రాన్ని క్రమపద్ధతిలో మడిచి, దాంతో పాటు స్వస్తిక్ గుర్తు రబ్బర్ స్టాంప్ ఇస్తారు. ఆ బ్యాలెట్లో ఆ స్థానానికి సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వాటికి ఎదురుగా వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. బ్యాలెట్ పత్రం తీసుకున్న తర్వాత సూచించిన ప్రదేశానికి (ఓటు వేసేందుకు పక్కన ఏర్పాటు చేసిన గది లాంటి అమరిక) వెళ్లి తాము ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గుర్తుపై సిరా ముద్ర వేసి, దాన్ని ఎన్నికల అధికారులు సూచించిన పద్ధతిలో మడిచి ప్రిసైడింగ్ అధికారి ఎదురుగా ఉండే బ్యాలెట్ బాక్సులో వేయాలి. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క.
అలాగే బ్యాలెట్ పత్రంపై అభ్యర్థికి సంబంధించిన గుర్తు ఉన్న బాక్సులో పైకి, కిందకి జరగకుండా కరెక్టుగా గుర్తు ఉన్న గడిలో మాత్రమే స్టాంప్ (సిరా ముద్ర) పడేలా జాగ్రత్త పడాలి. నిర్దేశిత గీతలను దాటితే.. ఆ ఓటును లెక్కించరు. చెల్లని ఓటుగా పరిగణిస్తారు. స్టాంప్ వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్ను తిరిగి అక్కడ ఉండే సిబ్బంది సూచించిన విధంగా క్రమ పద్ధతిలో మడత పెట్టాలి. లేకపోతే ఇంక్తో వేసిన స్వస్తిక్ ముద్ర మరో వైపు అంటుకొని ఆ ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. బ్యాలెట్ పేపరుతో ఓటు వేసే విధానానికి సంబంధించి జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. అవి చూసి వాటి ద్వారా మరింత అవగాహన పెంచుకోండి. ఓటు వేయడం మన హక్కు... ఆ హక్కును మాత్రం అశ్రద్ధ చేయొద్దు.