వేల కోట్ల రూపాయల విలువైన భూ వ్యవహారంలో.. 10లక్షల రూపాయలకోసం చేసిన కిడ్నాప్ కీలకంగా మారింది. ఈ కిడ్నాప్ కోసం విజయవాడ గ్యాంగ్ రంగంలోకి దిగిందని, వారి ద్వారానే పని పూర్తి చేశారని పోలీసులు తెలియజేశారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరో 15మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. అసలు వ్యవహారాన్ని వివరించారు. ఈ కేసులో సూత్రధారి, ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియేనని పోలీసులు తేల్చారు.

బౌన్సర్లతో కిడ్నాప్..
గతంలో అఖిల ప్రియ మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ కార్యక్రమాలకోసం బౌన్సర్లను సప్లయ్ చేసే సిద్ధార్థ అనే యువకుడు.. ఈ కిడ్నాప్ వ్యవహారానికి కూడా తన దగ్గరున్న యువకులను పంపించాడని చెప్పారు పోలీసులు. కిడ్నాప్ వ్యవహారంలో పాల్గొన్న 15మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

బాస్ కి రూ.5లక్షలు.. అసిస్టెంట్ లకు రూ.25వేలు..
అఖిలప్రియ అనుచరుడు గుంటూరు శ్రీను.. కిడ్నాప్ గ్యాంగ్ కి డబ్బులు సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు. మాదాల సిద్ధార్థకు గుంటూరు శ్రీను తమ కిడ్నాప్‌ ప్రణాళికను చెప్పి, 20 మంది యువకులను సమకూర్చాలని కోరాడు. రూ.5 లక్షలు సిద్ధార్థకు, ఒక్కో యువకుడికి రూ.25 వేల చొప్పున ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.74 వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు.

కిడ్నాప్ గ్యాంగ్ అందరినీ కూకట్‌ పల్లి లోని ‘ఎట్‌ హోం’ లాడ్జిలో ఉంచారు. ఐటీ అధికారులలాగా దుస్తులు సిద్ధం చేసి ఇచ్చారు. సెల్ ఫోన్లు, బొమ్మ తుపాకీ కొనిచ్చి, స్టాంప్ పేపర్లు కూడా ఇచ్చారు. వాటిపై సంతకాలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం రెక్కీ నిర్వహించి సాయంత్రం సమయంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసి కారుల్లో తీసుకెళ్లినట్టు తెలిపారు. వారిని కొట్టి సంతకాలు చేయించుకున్నారని, ఆలోగా విషయం బైటపడటంతో.. భయంతో వదిలేసి పారిపోయారని తెలిపారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.

కారు నెంబర్ ప్లేట్లు ఇలా మార్చారు..
కిడ్నాప్ కోసం మొత్తం 5 కార్లను వినియోగించారని, నకిలీ నెంబర్లను పేపర్ పై ప్రింట్ చేసి, వాటిని అసలు నెంబర్ ప్లేట్లకు అంటించారని చెప్పారు. అసలు సూత్రధారుల్ని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు  పోలీసులు. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: